ఫేవరెట్ కథ అడ్డం తిరిగింది
ఒకటో నెంబర్ జట్టు నిలబడితే ఒట్టు
టీ20 ప్రపంచకప్ ఆరంభ పోరులో భారత్ బోల్తా
దిమ్మదిరిగే షాకిచ్చిన కివీస్ స్పిన్నర్లు
79 పరుగులకే చేతులెత్తేసిన ధోనీసేన
47 పరుగుల తేడాతో అనూహ్య పరాజయం
127.. ఇదీ ఒక లక్ష్యమేనా? టాప్ఆర్డరే వూదేయదూ..!ఓ 15 ఓవర్లయితే సరిపోవూ!కివీస్ 20-30 పరుగులు ఎక్కువ చేసి ఉన్నా బావుండే..!ప్రపంచకప్ ఆరంభ పోరు మరీ ఇంత ఏకపక్షంగా సాగడమా!...ఇలాంటి ఆలోచనలే కలిగి ఉంటాయి భారత అభిమానులకు!కానీ ఆ ఆలోచనలన్నీ తల్లకిందులు కావడానికి ఎంతో సమయం పట్టలేదు!
స్పిన్ మన బలం.. కానీ అదే బలహీనతగా మారింది. స్పిన్ మన ఆయుధం.. కానీ అదే మనపైకి బూమరాంగ్ అయింది. న్యూజిలాండ్ కోసం తవ్విన ‘స్పిన్’ గోతిలో మన జట్టే పడిపోయింది. స్పిన్ ఆడటంలో సమర్థులుగా పేరున్న మన బ్యాట్స్మెన్.. ఆ ఉచ్చులోనే చిక్కుకుని విలవిలలాడిపోయారు. టీ20 ప్రపంచకప్ హాట్ ఫేవరెట్గా తొలి మ్యాచ్లో అడుగుపెట్టిన ధోనీసేనను అతి సామాన్య జట్టుగా మార్చేసింది న్యూజిలాండ్. మన బ్యాట్స్మెన్ నిర్లక్ష్యపు ఆటనే ఆసరాగా చేసుకున్న కివీస్ స్పిన్నర్లు.. టీమ్ఇండియాకు దిమ్మదిరిగే షాకిచ్చారు. భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ను కేవలం 79 పరుగులకే కుప్పకూల్చి.. పరాభవం మిగిల్చారు. పిచ్ ఎంతగా స్పిన్నర్లకు అనుకూలించినప్పటికీ.. పరిస్థితులకు తగ్గట్లు ఆడకుండా నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు చేజార్చుకున్న మన పేరు గొప్ప బ్యాట్స్మెన్దే ఈ ఓటమి బాధ్యత!
నాగ్పుర్
టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే అనూహ్య ఫలితం! సొంతగడ్డపై.. బలమైన జట్టుతో.. భారీ అంచనాల మధ్య.. హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. వూహించని విధంగా బోల్తా కొట్టింది. మంగళవారం నాగ్పుర్లో స్పిన్నర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్లో భారత్ 47 పరుగుల తేడాతో కివీస్ చేతిలో పరాభవం చవిచూసింది. 127 పరుగుల తక్కువ లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 79 పరుగులకే కుప్పకూలింది టీమ్ఇండియా. 30 పరుగులు చేసిన కెప్టెన్ ధోనీనే టాప్స్కోరర్. అతను, కోహ్లి (23), అశ్విన్ (10) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు. కివీస్ స్పిన్నర్లు శాంట్నర్ (4/11), ఇష్ సోధి (3/18), నాథన్ మెక్కలమ్ (2/15) భారత్ పతనాన్ని శాసించారు. 18.,1 ఓవర్లకే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు కివీస్ 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. అండర్సన్ (34; 42 బంతుల్లో 3×4) రాణించాడు. శాంట్నర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. భారత్ శనివారం తన తర్వాతి మ్యాచ్లో పాకిస్థాన్ను ఢీకొంటుంది.
నిలిస్తేగా..: 5, 1, 1, 4, 1, 0, 0, 0.. ధోని, కోహ్లి, అశ్విన్ కాకుండా మిగతా ఆటగాళ్ల స్కోర్లివి. మన బ్యాట్స్మెన్ వైఫల్యం గురించి ఇంతకంటే చెప్పేదేముంది? నాగ్పుర్ పిచ్ స్పిన్కు అనుకూలించిన మాట వాస్తవమే, కివీస్ స్పిన్నర్లు కూడా తెలివిగా బౌలింగ్ చేశారు. కానీ.. టీమ్ఇండియా ఓటమికి అసలు కారణం బ్యాట్స్మెన్ బాధ్యతారాహిత్యమే. కివీస్ స్పిన్నర్లకు ఆత్మవిశ్వాసాన్నందించింది.. భారత్ ఓటమికి పునాది వేసింది.. మన బ్యాట్స్మెనే. భారత్ కోల్పోయిన తొలి నాలుగు వికెట్లూ.. బ్యాట్స్మెన్ చేజేతులా సమర్పించుకున్నవే. ధావన్ (1) అడ్డంగా ఆడేసి వికెట్ల ముందు దొరికిపోతే.. రోహిత్ (5) చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తున్నట్లు ఆవేశంగా ముందుకు ఉరికి స్టంపౌటైపోయాడు.. రైనా (1), యువరాజ్ (4) అనాలోచితమైన షాట్లతో చేజేతులా వికెట్లిచ్చేశారు.. అయినా కోహ్లి, ధోని ఉన్నారులే అన్న భరోసా! కానీ కీలక సమయంలో కోహ్లి కూడా ఔటైపోయాడు. అతను ఇష్ సోధి వేసిన చక్కటి బంతికి పెవిలియన్ చేరిపోయాడు. ఇక ఆ తర్వాత ధోని ఎంత పట్టుదల ప్రదర్శించినా ఫలితం లేకపోయింది. పాండ్య (1), జడేజా (0)లకు కూడా క్రీజులో నిలిచే ఉద్దేశమే కనిపించలేదు. అశ్విన్.. ధోనికి అండగా నిలిచినా సాధించాల్సిన రన్రేట్ భారీగా పెరిగిపోవడంతో భారత్ అవకాశాలు సన్నగిల్లిపోయాయి. బంతి బ్యాట్ మీదకు రాకపోవడంతో ఛేదన అసాధ్యమని ముందే తేలిపోయింది. ధోని ఒకట్రెండు షాట్లు ఆడాడు కానీ.. అప్పటికే ఆలస్యమైపోయింది. 15 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరగడంతో భారత్ కథ ముగిసింది.
కివీస్ వ్యూహం మార్చుకుని..: అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. దూకుడుగా ఆడి భారత్ను ఆత్మరక్షణలోకి నెట్టేద్దామని చూసింది. కానీ ఆ వ్యూహం బెడిసికొట్టింది. తొలి ఓవర్లోనే రెండు సిక్సర్లు బాదారు ఆ జట్టు బ్యాట్స్మెన్. కానీ ఒకటిన్నర ఓవర్లకే రెండు వికెట్లు కూడా పడ్డాయి. దీంతో కివీస్ వ్యూహం మార్చుకుని పరిస్థితులకు తగ్గట్లు నెమ్మదిగా ఆడి.. గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.
ఆ 9 బంతుల్లో డ్రామా: మ్యాచ్లో హైలైట్ అంటే తొలి 9 బంతుల్లో సాగిన డ్రామానే. స్టేడియంలో ప్రేక్షకులు.. టీవీల్లో వీక్షకులు కుదురుకునే లోపే మ్యాచ్లో నాటకీయ పరిణామాలు జరిగిపోయాయి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనా ఉండటంతో ధోని.. నేరుగా అశ్విన్కు కొత్త బంతి అందించాడు. అతనలా బంతి వేశాడో లేదో.. కివీస్ ఓపెనర్ గప్తిల్ బంతిని నేరుగా స్టాండ్స్లోకి పంపించేశాడు. అందరూ ఆశ్చర్యంలో ఉండగానే.. అశ్విన్ దెబ్బకు దెబ్బ తీశాడు. రెండో బంతికే గప్తిల్ (6)ను వికెట్ల ముందు బలిగొన్నాడు. ఐతే రీప్లేలో బంతి వికెట్కు తాకేది కాదని తేలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మున్రో (7).. ఆశ్చర్యకర రీతిలో రివర్స్ స్వీప్తో సిక్సర్ బాది అశ్విన్కు షాకిచ్చాడు. ఐతే తర్వాతి ఓవర్లో నెహ్రా మూడో బంతికి మున్రోను ఔట్ చేశాడు. మొత్తంగా 9 బంతుల్లో 2 సిక్సర్లు.. 2 వికెట్లతో మ్యాచ్కు ఆసక్తికర ఆరంభం లభించింది.
దూకుడు మంత్రం పని చేయకపోవడంతో ఆ తర్వాత కివీస్ బ్యాట్స్మెన్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ధోని తెలివిగా బౌలింగ్ మార్పులు చేస్తూ.. కివీస్ బ్యాట్స్మెన్కు మరింతగా ఇబ్బందులు సృష్టించాడు. బుమ్రా, రైనా, జడేజా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. మరోవైపు వికెట్ల పతనం కూడా ఆగలేదు. రైనా తన బౌలింగ్తో, ఫీల్డింగ్తో కివీస్ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. విలియమ్సన్ (8)ను స్టంపౌట్ చేయించిన అతను.. టేలర్ (10)ను రనౌట్ చేశాడు. ఐతే పరిస్థితులకు తగ్గట్లు ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన అండర్సన్.. కివీస్ స్కోరును వందకు చేరువ చేశాడు. అతను ఔటయ్యాక కివీస్ మళ్లీ ఇబ్బంది పడ్డప్పటికీ.. చివర్లో రోంచి (21 నాటౌట్; 11 బంతుల్లో 2×4, 1×6) మెరవడంతో భారత్కు సవాలు విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది.
5
టీ20ల్లో భారత్ జట్టు కివీస్తో ఐదు మ్యాచ్లు ఆడి ఐదింట్లో ఓడిపోయింది |
నగుబ్యాటు ధావన్ (1) ఎల్బీ(బి) నాథన్
తొలి ఓవర్లో నాథమ్ మెక్కలమ్ బంతిని అడ్డంగా స్వీప్ చేసి అడ్డంగా దొరికిపోయాడు ధావన్. అప్పటికి స్కోరు పదే. మరో రెండు పరుగులైనా చేరాయో లేదో మరో రెండు వికెట్లు పెవిలియన్ చేరాయి. టీమ్ఇండియా ఒక్కసారిగా ఒత్తిడిలోకి కూరుకుపోయింది. పూర్తిగా వెనుకంజలో పడింది.
రోహిత్ (5) (స్టంప్డ్) రోంచి (బి) శాంట్నర్
ఈసారి ఎడమచేతి వాటం స్పిన్నర్ శాంట్నర్ చుట్టేశాడు. మూడో ఓవర్లో రోహిత్ శర్మ, రైనాలను బోల్తా కొట్టించాడు. శాంట్నర్ బంతిని చాలా ముందుకొచ్చి లెగ్సైడ్ ఆడబోయిన రోహిత్ గురి తప్పాడు. స్టంపౌటయ్యాడు. ఇక రైనా అయితే మిడ్వికెట్లో ఓ లడ్డూ లాంటి క్యాచ్ వెనుదిరిగాడు. కాస్త వెనక్కి జరిగే అడ్డంగా తిరిగి ఆడబోయిన రైనా.. బంతి బ్యాటు అంచుకు తగలడంతో గప్తిల్కు చిక్కి బ్యాటు చంకన పెట్టుకున్నాడు.
రైనా (1) (సి)గప్తిల్ (బి) శాంట్నర్
బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కువ అవకాశాలు రావట్లేదని బాధపడుతున్న యువరాజ్ ఇప్పుడు అవకాశం వచ్చినా పేలవంగా ఆడి ఆలస్యం చేయకుండా ఆత్రంగా పెవిలియన్ చేరిపోయాడు. మరోవైపు ఉన్న కోహ్లికి కనీస సహకారం ఇవ్వలేకపోయాడు. మెక్కలమ్ ఫ్లైటెడ్ డెలివరీని ముందుకొచ్చి ఆడిన అతడు అటు ఇటూ కొట్టకుండా నేరుగా అతడి చేతికే అందించాడు. వికెట్లు పోతున్నా భారత్ ఆశలతో సాగిందంటే కారణం కోహ్లినే. కానీ 9వ ఓవర్లో సోధి చక్కని లెగ్ బ్రేక్కు అతడూ వెనుదిరగడంతో భారత్ వేగంగా పతనం దిశగా అడుగులేసింది. అప్పటికి స్కోరు 39/5. తర్వాతి రెండు ఓవర్లలో పాండ్య, జడేజా వచ్చినంత వేగంగా పెవిలియన్ బాట పట్టారు. కొన్ని బంతులు దొరక్కకుండా స్పిన్ చేశాక.. శాంట్నర్ నేరుగా, వేగంగా వేసిన బంతికి పాండ్య చిక్కాడు. బ్యాక్ఫుట్పై బ్యాటును గుడ్డిగా వూపేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. పట్టుదల కొరవడిన జడేజా.. సోధి బంతిని ఫ్రంట్ఫుట్పై లెగ్సైడ్ ఆడబోయి దెబ్బతిన్నాడు. అప్పటికి ధోని క్రీజులోనే ఉన్నా.. కివీస్ బౌలింగ్ చూస్తుంటే 43/7తో ఉన్న భారత్ ఓటమి తప్పించుకోలేదని తేలిపోయింది. |
‘‘బ్యాట్స్మెనే ముంచారు. షాట్ సెలెక్షన్ చాలా దారుణంగా ఉంది. పరిస్థితులను కివీస్ బాగా సద్వినియోగం చేసుకుంది. పిచ్కు తగ్గట్టు ఆటను అన్వయించుకోవడంలో విఫలమయ్యాం’’
- ధోని
|
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్తిల్ ఎల్బీ (బి) అశ్విన్ 6; విలియమ్సన్ (స్టంప్డ్) ధోని (బి) రైనా 8; మున్రో (సి) పాండ్య (బి) నెహ్రా 7; అండర్సన్ (బి) బుమ్రా 34; రాస్ టేలర్ రనౌట్ 10; శాంట్నర్ (సి) ధోని (బి) జడేజా 18; ఇలియట్ రనౌట్ 9; రోంచి నాటౌట్ 21; నాథన్ మెక్కలమ్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు: 13; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126; వికెట్ల పతనం: 1-6, 2-13, 3-35, 4-61, 5-89, 6-98, 7-114; బౌలింగ్: అశ్విన్ 4-0-32-1; నెహ్రా 3-1-20-1; బుమ్రా 4-0-15-1; రైనా 4-0-16-1; జడేజా 4-0-26-1; పాండ్య 1-0-10-0
భారత్ ఇన్నింగ్స్: రోహిత్శర్మ (స్టంప్డ్) రోంచి (బి) శాంట్నర్ 5; శిఖర్ ధావన్ ఎల్బీ (బి) నాథన్ మెక్కలమ్ 1; కోహ్లి (సి) రోంచి (బి) సోధి 23; రైనా (సి) గప్తిల్ (బి) శాంట్నర్ 1; యువరాజ్ (సి) అండ్ (బి) మెక్కలమ్ 4; ధోని (సి) మెక్కలమ్ (బి) శాంట్నర్ 30; పాండ్య ఎల్బీ (బి) శాంట్నర్ 1; జడేజా (సి) అండ్ (బి) సోధి 0; అశ్విన్ (స్టంప్డ్) రోంచి (బి) సోధి 10; నెహ్రా (బి) మిల్నె 0; బుమ్రా నాటౌట్ 0; ఎక్స్ట్రాలు: 4; మొత్తం: (18.1 ఓవర్లలో ఆలౌట్) 79; వికెట్ల పతనం: 1-5, 2-10, 3-12, 4-26, 5-39, 6-42, 7-43, 8-73, 9-79; బౌలింగ్: నాథన్ మెక్కలమ్ 3-0-15-2; అండర్సన్ 3-0-18-0; శాంట్నర్ 4-0-11-4; ఇలియట్ 2-0-9-0; మిల్నె 2.1-0-8-1; సోధి 4-0-18-3
|